మహానాడులో టీడీపీకి విరాళాల వెల్లువ... రెండు రోజుల్లో మొత్తం ఎంత వ‌చ్చాయంటే..!

  • రెండు రోజుల్లో రూ.25.61 కోట్లు వచ్చినట్లు ప్రకటించిన చంద్రబాబు
  • అత్యధికంగా రూ.5 కోట్లు విరాళమిచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు
  • కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కోట్లలో విరాళాలు
  • విరాళాల సేకరణ ఎన్టీఆర్ హయాం నుంచే ఉందని తెలిపిన సీఎం
టీడీపీ మహానాడుకు విరాళాలు వెల్లువెత్తాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో పార్టీకి నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీగా ఆర్థిక చేయూతను అందించారు. మొత్తం రూ.25.61 కోట్ల విరాళాలు అందినట్లు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విరాళాలు అందించిన ప్రతి ఒక్కరి పేరును వేదికపై నుంచి చదివి, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

మహానాడులో భాగంగా తొలిరోజు రూ.12.44 కోట్లు, రెండో రోజు రూ.13.17 కోట్ల చొప్పున విరాళాలు అందాయని చంద్రబాబు వివరించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిసి అత్యధికంగా రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. పార్టీ కోసం వివిధ రూపాల్లో సేవలందిస్తున్నారని, కొందరు సోషల్ మీడియాలో, మరికొందరు క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే, ఇంకొందరు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచే మహానాడులో విరాళాలు స్వీకరించే సంప్రదాయం ఉందని, గతంలో హుండీ ఏర్పాటు చేసేవారని సీఎం గుర్తుచేశారు.

రెండో రోజు అందిన ప్రధాన విరాళాల్లో ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా తరఫున రాజగోపాల్ రూ.1.50 కోట్లు అందించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు, నారాయణ విద్యాసంస్థలు తలో రూ.కోటి చొప్పున విరాళం ఇచ్చారు. తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్‌ రూ.50 లక్షలు అందించారు.

వీరితో పాటు ఏపీ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహన్‌కృష్ణ రూ.27 లక్షలు, టీడీపీ నేత శంకర్ రెడ్డి రూ.25 లక్షలు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రూ.19 లక్షలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ.15 లక్షలు ఇచ్చారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు రూ.10 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విరాళాలు ప్రకటించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, గురజాల జగన్మోహన్, కురుగొండ్ల రామకృష్ణ, మామిడి గోవిందరావు, నరేంద్ర వర్మ వంటి వారు రూ.10 లక్షల చొప్పున అందించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, పరిటాల సునీత, శ్రీరాం రాజగోపాల్ తదితరులు రూ.5 లక్షలు చొప్పున పార్టీకి తమవంతు సహకారం అందించారు.

Chandrababu
TDP Mahanadu
TDP Donations
Telugu Desam Party
Vemireddy Prabhakar Reddy
Pemaasani Chandrasekhar
Narayana Educational Institutions
Andhra Pradesh Politics
Political Donations India
AP Politics

More Telugu News